దాసరి దిగిపోయారు.. మా ఎన్నికలు ఇక ఏకగ్రీవమే !

మా ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ప్రకాష్ రాజ్-మంచి విష్ణు ప్యానల్స్ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంచు విష్ణు ప్యానల్ నాన్ లోకల్ కార్డ్ ని హైలైట్ చేస్తే.. ప్రకాష్ రాజ్ ప్యానల్ డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్నారు. వీరిద్దరు కాకుండా న‌టుడు సీవీఎల్ న‌ర‌సింహారావు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తున్నారు. శ్రీ‌రామ‌చంద్రుడు త‌న క‌ల‌లోకి వ‌చ్చి ప్ర‌కాశ్‌రాజ్‌ను ఓడించాల‌ని పిలుపు ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తాజాగా ఆయ‌న ఓ వీడియో విడుద‌ల చేశారు. ఆ వీడియోలో దాసరి నారాయణ రావు దిగిపోయారు. మా ఎన్నికలని ఏకగ్రీవం చేయబోతున్నారని చెప్పుకొచ్చారు.

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. దాసరిగారు నాకు కలలోకి వచ్చారు. అందరికీ ఇది కాస్త వెటకారంగానే ఉంటుంది. ఎందుకంటే మొన్న రాముడు, ఇవాళ దాసరా? అని. కానీ ఆయనని మరచిపోలేం. ఆయనతో ఏంటండీ ఇదంతా అని అడిగాను(కలలో). అందుకు దాసరిగారు.. ‘మీరంతా నేను ఉన్నానని అంటుంటారుగా? మీరంతా ఏం చేస్తున్నారు. తండ్రికి మించిన తనయుడు, గురువును మించిన శిష్యుడు అంటుంటారుగా? మోహన్ బాబు నన్ను తండ్రిగా అనుకున్నాడు.

నేను అతన్ని కొడుకుగా, శిష్యుడిగా భావించాను. నా కొడుకుకి కొడుకు విష్ణు ఉన్నాడు. అతడిని గెలిపించమని చెప్పడం లేదు.. కానీ నేను మోహన్ బాబుకి నేర్పిన సంస్కారం, ఆయన వాళ్లబ్బాయికి నేర్పిన సంస్కారం తెలియంది కాదు. ఆ సంస్కారం వల్లే కదా పెద్దవాళ్లందరూ కలిసి తప్పుకోమంటే తప్పుకుంటానని అంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. మీ వ్యవహారం ఏంటి?’ అని అడిగారు. దీనికి నేను.. పెద్దవారందరినీ కూర్చోబెట్టి యునానిమస్‌గా చేయడానికి నా దగ్గర వాళ్లందరి నెంబర్లు లేవు సార్ అని చెప్పా. అయితే మీరు చేసేది మీరు చేయండి నేను చేసేది నేను చేస్తానని దాసరిగారు అన్నారు’ అని సీవీఎల్ చెప్పుకొచ్చారు. ఇది నమ్మి తీరాల్సిందే మరీ.. !