మళ్లీ కాసుల పంట

 కరోనా గాయం నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకున్నాయి. కొన్ని చోట్ల ఇంకా లేదు. భారతీయ చిత్ర పరిశ్రమకు కీలకంగా నిలిచే మహారాష్ట్రలో ఈ నెల 22 తర్వాత థియేటర్లు తెరచుకోనుండటంతో సినిమాలు వరస కడుతున్నాయి. ఈ నెలాఖరుకి సుమారు అన్నిచోట్లా థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నాలుగు నెలల కాలంలో వంద సినిమాలకు పైగా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకు పునర్ వైభవం రాబోతుంది.

కరోనా రాకముందు అంటే 2019లో భారతీయ చిత్ర పరిశ్రమకు కాసుల పంట పండింది. అన్ని భాషల్లోనూ కలిసి సుమారు రూ.10,000 కోట్లు ఆ ఏడాదిలో వచ్చాయి. వచ్చే ఏడాది కచ్చితంగా అలాంటి భారీ మొత్తాన్ని చిత్రసీమ చూస్తుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. వచ్చే నాలుగు నెలల్లో ప్రతివారం తక్కువలో తక్కువ 5 నుంచి 6 చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిల్లో కనీసం రెండైనా భారీ అంచనాలున్నవి. ఈ ఏడాది చివరి నాటికి సుమారుగా రూ.4000 – 6000 కోట్లు బాక్సాఫీసు వద్ద వసూళ్లు దక్కనున్నట్టు ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. నాలుగు నెలల కాలంలో రానున్న చిత్రాల్లో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి రెండో వారం కచ్చితంగా ఒకటి లేదా రెండు భారీ విజయాలు సాధించడం ఖాయం అని అంచనా. ఈ నెల 23 నుంచి మహారాష్ట్రలో థియేటర్లు తెరిచాకా లెక్కేసుకుంటే దేశం మొత్తంలో 98శాతం తెరలు అందుబాటులోకి వచ్చేస్తాయి. మొత్తంగా 3000 మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు సందడి చేయనున్నాయి.