రెండ్రోజుల పాటు ఐపీఎల్ వేలం

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) మెగా వేలాన్ని బీసీసీఐ రెండ్రోజులపాటు నిర్వహించనుందని తెలుస్తోంది. 2022 ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది. కరోనా పరిస్థితులు సాధారణంగా ఉంటే మెగా వేలం ఈవెంట్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని, అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

”కొవిడ్ పరిస్థితులు మరింత దిగజారకపోతే భారత్‌లోనే ఐపీఎల్‌ మెగా వేలం నిర్వహిస్తాం. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం బెంగళూరులో ఉండొచ్చు. దానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నాం” అని సదరు అధికారి వివరించినట్లు పీటీఐ పేర్కొంది. అయితే వివిధ క్రీడా వర్గాల ప్రకారం మెగా ఆక్షన్‌ యూఏఈలోనే ఉంటుందని తెలుస్తుండగా.. బీసీసీఐ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. 2022 ఐపీఎల్ కోసం రెండు కొత్త జట్లు సహా మొత్తం పది టీమ్‌లు బరిలోకి దిగనున్నాయి. కొత్తగా లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలు ఆడబోతున్నాయి.