సినీ పరిశ్రమలో మరో విషాదం.

సినీ చిత్ర పరిశ్రమ ఒకరు తర్వాత మరొకరు దిగ్గజాలను  పొగొట్టుకోవడం  నిజంగా బాధాకరం. తాజాగా నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్య వినాయగం 1943 డిసెంబరు 10న జన్మించారు. గాయకుడు సీఎస్‌ జయరామన్‌ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ‘దిల్‌’ (2001) అనే తమిళ చిత్రంతో చిత్ర పరిశ్రమలో గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటల్ని పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు. ఆయన పాడిన ప్రతి పాటా సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’తో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్రవేశారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించారు. మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.