దర్శకుడికి కిక్ ఇస్తాడట

మాస్ మాహారజా రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘కిక్’ ఒకటి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇప్పుడీ దర్శకుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఒకరిగా పేరు తెచ్చుకొన్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ, సురేందర్ రెడ్డి.. వీరిద్దరికి ‘కిక్’నిచ్చిన కథని అందించింది మాత్రం రచయిత వక్కంతం వంశీ. ఇప్పుడీ రచయిత డైరెక్టర్ గా మారాడు. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్’తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తీశాడు. మిక్సిడ్ టాక్ తో ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ఇప్పుడీ దర్శకుడు తీయబోయే తదుపరి సినిమా ఏంటీ ? అన్నదానిపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. మాస్ మహారాజా రవితేజతో వంశీ రెండో సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ‘కిక్’ సినిమా నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. పైగా వంశీ టాలెంట్ గురించి రవితేజ బాగా తెలుసు. అందుకే దర్శకుడిగా వంశీ తొలి ప్రయత్నం సక్సెస్ కాక్పోయినా.. ఆయనపై నమ్మకంతో రవితేజ తన సినిమా ఆఫర్ ఇచ్చాడని చెప్పుకొంటున్నారు.

ప్రస్తుతం రవితేజ శ్రీను వైట్ల ‘అమర్ అక్భర్ ఆంథోని’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘ఎక్కడికిపోతావు చిన్నివాడ’ ఫేం వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత వక్కంతం వంశీ సినిమా ఉండనుందని చెబుతున్నారు. నిజానికి వంశీ రెండో సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉంటుందని అందరు భావించారు. తారక్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇవ్వాల్సిన వంశీ.. బన్నీతో తొలి సినిమా తీశాడు. కనీసం రెండో సినిమానైనా తారక్ తో ఉంటుందేమో అనుకొన్నారు. ఇప్పుడు కుదరలేదు. మరీ.. వంశీ దర్శకత్వంలో తారక్ సినిమా ఎప్పుడు ఉంటుందో ? చూడాలి.