సీఎం కేసీఆర్ కు అస్వస్థత.. ప్రధాని పర్యటనకు దూరం !

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన ఈ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. జ్వరం తగ్గితే ముచ్చింతల్‌ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వాస్తవానికి శుక్రవారమే ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటారు.. ప్రధానికి మంత్రి తలసాని ఆహ్వానం పలుకుతారనే ప్రకటన విడుదల చేశారు. అయితే సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నట్టు తెలిసింది. ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సీఎం వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆఖరి నిమిషంలో కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే వార్త బయటకు చెప్పారు. ఇక  ప్రధానమంత్రి నరేంద్రమోదీ పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్‌ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.