భారత్‌ సాయం కోరిన ఉక్రెయిన్‌

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో అక్కడి పరిణామాలు వేగంగా మలుపు తిరుగుతున్నాయి. మరోవైపు సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌.. భారత్‌ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించగలదని, ఈ విపత్కర పరిస్థితుల్లో దిల్లీ తమకు అండగా ఉండాలని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పొలిఖా కోరారు.

“సైనిక చర్యే అని ప్రకటిస్తోన్న రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది. రష్యా బలగాలు సరిహద్దులను దాటి మా భూభాగంలోకి వచ్చేశాయి. కొన్ని చోట్ల దాడులు జరగ్గా.. సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారత్‌ జోక్యం చేసుకుని మాకు అండగా ఉండాలని కోరుతున్నాం. భారత్‌ ప్రభావవంతమైన దేశం. దౌత్యపరంగా మీ చరిత్ర గురించి మాకు తెలుసు.

గతంలో చాలా సార్లు భారత్‌ శాంతిస్థాపనలో కీలక పాత్ర పోషించింది. రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అందువల్ల ఉద్రిక్తతలను తగ్గించడంలో దిల్లీ కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తక్షణమే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, మా అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్‌ చేసి మాట్లాడాలని కోరతున్నా. మోదీజీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన నేత. ఎవరు చెబితే పుతిన్‌ వింటారో లేదో తెలియదు గానీ.. మోదీ చెబితే పుతిన్‌ వింటారని విశ్వసిస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపేలా మీ బలమైన గళాన్ని కోరుతున్నాం” అని ఇగోర్‌ పొలిఖా భారత్‌ను కోరారు.