ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ – జడేజా టాప్

ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. దీంట్లో టీమ్‌ఇండియా ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు ఫార్మాట్‌ ఆల్‌రౌండర్‌ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారీ శతకం (175 నాటౌట్‌) బాదిన విషయం తెలిసిందే. దాంతో పాటు బంతితోనూ గొప్ప ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. మరో ఆల్ రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (2), జస్ప్రీత్ బుమ్రా (10) స్థానాల్లో నిలిచారు.
 
బ్యాటింగ్‌ విభాగంలో టీమ్‌ఇండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (5), రోహిత్‌ శర్మ (6), రిషభ్‌ పంత్ (10) స్థానాలు దక్కించుకున్నారు. టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఫిబ్రవరి నెలకుగానూ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’గా నామినేట్ అయ్యాడు. గత నెలలో శ్రీలంకతో జరగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో శ్రేయస్‌ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 174.35 స్ట్రైక్‌ రేట్‌తో 204 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ మూడు అర్ధ శతకాలు నమోదు చేయడం విశేషం.