పాన్‌తో ఆధార్‌ అనుసంధానం.. నేడే ఆఖరు !

పాన్‌ తో ఆధార్‌ సంఖ్యను అనుసంధానానికి నేటితో గడువు ముగియనుంది. మార్చి 31 తర్వాత ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌లన్నీ ఇన్‌యాక్టివ్‌గా మారతాయి. అయితే మార్చి 31  తర్వాతి మూడు నెలలు అంటే జూన్‌ 30, 2022 వరకు అనుసంధానం చేసే వారు రూ.500, ఆ తర్వాత చేసే వారు రూ.1,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టం చేసింది. బ్యాంకింగ్‌ సేవలను పొందడం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు, యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇలాంటి సేవలన్నీ ఎలాంటి అవాంతరం లేకుండా పొందాలంటే.. మీ పాన్‌ను ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సిందే.

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం ఇలా.. 

  1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ తెరవండి.  
  2. మొద‌టిసారి లాగిన్ అయ్యే వారు రిజిస్ట‌ర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబరే(శాశ్వత ఖాతా సంఖ్య) మీ యూజర్ ఐడీ అవుతుంది.
  3. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.  
  4. ఆధార్‌-పాన్ లింక్ కోసం ఒక పాప్‌-అప్ విండో ఓపెన్ అవుతుంది.  
  5. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి స‌మాచారం క‌నిపిస్తుంది.  
  6. స్క్రీన్‌పై క‌నిపిస్తున్న పాన్ కార్డు వివ‌రాల‌ను ఆధార్‌లో పేర్కొన్న వివరాల‌తో  ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ వివ‌రాల‌లో ఏమైనా తేడాలు ఉంటే రెండింటిలో ఒకే విధంగా ఉండేలా సరి చేసుకోవాలి.  
  7. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి “ లింక్ నౌ ” బటన్ పై క్లిక్ చేయండి.  
  8. మీ ఆధార్, పాన్‌తో విజ‌య‌వంతంగా లింక్ అయిన‌ట్లు పాప్-అప్ విండోతో సందేశం వ‌స్తుంది.  
  9. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలో క‌నిపిస్తున్న‌ “లింక్ ఆధార్” పై క్లిక్ చేయడం ద్వారా కూడా నేరుగా అనుసంధానించ‌వ‌చ్చు.