తీన్మార్‌ మల్లన్న అరెస్ట్

భూసేకరణ జీవో 80ఏ ను రద్దు చేయాలని కోరుతూ హన్మకొండ జిల్లా అరెపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గ్రామసభ నిర్వహించిన రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. మల్లన్నను అరెస్టు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర తోపులాట మధ్య మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శాంతియుతంగా గ్రామసభ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందిని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదని, భూసేకరణ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు రైతులకు మద్దతుగా మల్లన్న మట్లాడుతూ… బాధిత రైతులకు అండగా ఉంటామన్నారు. 80ఏ జీవోను రద్దు చేసే వరకు రైతులు ఐక్యంగా ప్రభుత్వంపై పోరాడాలన్నారు.