తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్

ప్రస్తుతం తెలంగాణలో పోటాపోటీ రాజకీయ సాగుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తామేనని నిరూపించుకునే ప్రయత్నాల్లో విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాతే చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. అయితే కొన్ని రోజులుగా సీన్ మారింది. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత రాజీనామా చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆమె లేఖ రాశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన శోభారాణి గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నారు. వామపక్ష ఉద్యమ నేపథ్యం ఉన్న శోభారాణికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. బీసీ నేతగా ఆమెకు ఆ వర్గాల నుంచి మద్దతు ఉంది. టీడీపీలో పని చేసినప్పుడు రేవంత్ రెడ్డితో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని తెలుస్తోంది. త్వరలోనే శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ తీసుకొనే ఆయన కమలతీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శోభారాణి బీజేపీని వీడి.. కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది.