గోపీచంద్ మళ్లీ విలన్ వేషాలు

హీరోగా కెరీర్ ప్రారంభించి, విలన్‌గా సక్సెస్‌ అయ్యి మళ్లీ హీరోగా నిలదొక్కుకున్నారు గోపీచంద్. ఆయన మళ్లీ విలన్ వేషాలు వేసేందుకు రెడీ అంటున్నారు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్-రాశీఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ విలన్ పాత్రలు చేయడంపై స్పందించారు.

విలన్ పాత్రలు చేస్తాను. కథ, రోల్‌ నాకు నచ్చాలి. నేను విలన్‌గా చేసిన పాత్రలన్నీ హీరోలకి దీటుగా ఉండేవే. ఆ వైవిధ్యం ఉంటేనే చేస్తానని అన్నారు. ఇక, మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాలో విలన్ పాత్ర ఆఫర్ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక్కడులో విలన్ పాత్ర కోసం ముందుగా ప్రకాశ్‌రాజ్‌ని సంప్రదించారు. ఆయనకు డేట్స్‌ కుదరకపోవటంతో దర్శకుడు గుణశేఖర్‌ ఓబుల్‌ రెడ్డి పాత్ర గురించి నాకు చెప్పారు. నాకు ఆసక్తిగా అనిపించి చేస్తానని చెప్పాను. ఆ తరువాత ప్రకాశ్‌రాజ్‌కి డేట్లు సర్దుబాటు కావడంతో ఆయనే చేశారని చెప్పుకొచ్చారు.  అయితే ప్రభాస్ హీరోగా, గోపీచంద్ విలన్ గా నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు.