ఉపరాష్ట్రపతి రేసులో కెప్టెన్‌ ?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గెలుపు దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. దీంతో అధికార పార్టీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై దృష్టి పెట్టింది. ఈ రేసులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పేరు తాజాగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని తెలుస్తోంది. 

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన అమరీందర్‌. గతేడాది హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌తో విభేదాలు రావడంతో ఆయనను సీఎం పదవి నుంచి కాంగ్రెస్‌ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీని ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. పటియాలా నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్‌ కూడా ఓటమిపాలయ్యారు. అయితే అమరీందర్‌ సింగ్‌ తన పార్టీని ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ)’ భాజపాలో విలీనం చేయనున్నారని సమాచారం. ఆ వెంటనే ఆయన్ని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.