నరేష్ నాలుగో పెళ్లి.. ఓ థ్రిల్లర్ సినిమా !

సీనియర్ నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇందులో రెండు పెళ్లిళ్లు ఇప్పటికే పెటాకులు కూడా అయ్యాయి. ప్రస్తుతం నరేష్ నాలుగో పెళ్లి రెడీ అయ్యారు. సీనియర్ నటి పవిత్రా లోకేష్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య తెరపైకి వచ్చారు. తనకు విడాకులు ఇవ్వకముందే మరో మహిళను ఎలా పెళ్లాడతారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో న‌రేశ్‌, ర‌మ్య‌, ప‌విత్ర లోకేశ్ మ‌ధ్య వైవాహిక వ్య‌వ‌హార బంధం వ్యవహారం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. 

పవిత్రా లోకేష్ తో తనది పవిత్ర బంధం. తామిద్దరం మంచి స్నేహితులమని నరేష్ మీడియా ముఖంగా ప్రకటించిన మరుసటిరోజే..ఈ జంట ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. నరేష్ మూడో భార్య రమ్య వీరిని పట్టించింది. తనకు విడాకులు ఇవ్వక ముందే మరో మహిళతో ఎలా కునుకు తావని రమ్య నిలదీసింది. పవిత్రా లోకేష్ ను చెప్పుతో కొట్టినంత పని చేసింది. ఈ సందర్భంగా నరేష్ తన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్నంత హ్యాపీ మూడ్ లో కనిపించారు. ఈలలు, అరుపులతో హీరోయిజం చూపించారు.

మరోవైపు, పవిత్రా లోకేష్ భర్త సుచింద్రప్రసాద్ సీన్ లోకి వచ్చారు. ప‌విత్ర ఇప్ప‌టికీ త‌న భార్యే అని ఆయన స్ప‌ష్టం చేశారు. తాము సహజీవనం చేయలేదు. 16 ఏళ్ల క్రిందట పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని షాకింగ్ నిజాలు చెప్పారు. పవిత్ర తన భార్య అనడానికి రుజువులు కూడా ఉన్నాయి. త‌న పాస్‌పోర్టులో భార్య‌గా ప‌విత్ర‌, అలాగే ఆమె పాస్‌పోర్టులో భ‌ర్త‌గా త‌న పేరు న‌మోదైన‌ట్టు ఆయ‌న చెప్పారు. తాము ఇప్పటికీ ఆదర్శదంపతులుగానే ఉన్నామ‌ని సుచింద్రప్రసాద్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ప‌విత్ర క‌లిసి వుంటున్న న‌రేశ్ ఎవ‌రో, ఆయ‌న‌తో ఆమెకున్న సంబంధాల గురించి నిజంగానే త‌న‌కు తెలియ‌ద‌ని సుచింద్రప్రసాద్ చెప్పడం కొసమెరుపు.