సీపీఐ నారాయణ మెగా పశ్చాత్తాపం

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడంపై సీపీఐ నేత నారాయణ పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చిరంజీవి అభిమానులు, జన సైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా నారాయణ స్పందిస్తూ..  తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

“నా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతలు కొంత మందికి బాధ.. మరికొంత మందికి ఆవేశం కలిగింది. వారి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అవిలేకుండా రాజకీయాలు ఉండవు. ఆ ప్రకారం నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా పరిగణించాలి. ఆ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలి” అని నారాయణ కోరారు.