జమిలీ ఎన్నికలు లేనట్టేనా ?

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అన్నది బీజేపీ విధానం. కొంత కాలంగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రాలకు, పార్లమెంట్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశానికి ఆర్థికంగా భారం అవుతోందని బీజేపీ అభిప్రాయం. జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం అంత తొందర ఉన్నట్లుగా వ్యవహరించడం లేదు. ఆ విషయాన్ని దాదాపుగా పక్కన పెట్టేసింది.

ప్రస్తుతం లా కమిషన్ వద్ద ఉందని.. ఆ కమిషన్ సిఫార్సులు చేస్తుందని కేంద్రం చెబుతోంది. నిజానికి లా కమిషన్ అందరి వద్ద అభిప్రాయాలు తీసుకుని ఏళ్లు గడిచిపోతున్నాయి. కేంద్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎలాంటి సిఫార్సులు కావాలంటే అలాంటి సిఫార్సులు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. కానీ కేంద్రమే ఇప్పుడే మంచి ముహుర్తం రాలేదని ఎదురు చూస్తున్నట్లుగాఉంది.

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత .. ప్రతీ ఏడాది ఏదో ఓ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రాల్లో స్థానిక సంస్థల హడావుడి ఉంటోంది. ఈ కారణంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వాల దృష్టి పూర్తిగా ఎన్నికల మీదే ఉంటోందని .. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని కేంద్రం అనుకుంటోంది. ఇప్పటికే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు ఓకే చేశాయి. ప్రధానమంత్రి కూడా పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. సీఈసీ కూడా తాము సిద్ధమన్నారు. కానీ కేంద్రం జెమిలీ ఎన్నికలకు పోయేందుకు పెద్దగా ఆసక్తిని చూపడం లేదని అనిపిస్తోంది.