అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా చేస్తాం : తారక్

అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు తారక్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  “సినీ పరిశ్రమకి గడ్డుకాలం అని… థియేటర్‌కి ప్రేక్షకులు రావడం లేదనీ అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం తెలుగు ప్రేక్షకులది. రానున్న ‘బింబిసార’తోపాటు మరో చిత్రం ‘సీతారామం’ని ఆదరించి తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్త ఊపిరి పోయాలని కోరుకుంటున్నా” అన్నారు.

దర్శకుడు వశిష్ఠ్‌ నాకు తెలుసు. కొత్తగా వచ్చాడు, అనుభవం లేదు, ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్‌ చేయగలడా అనే భయం ఉండేది. కానీ ఆ రోజు ఎంత కసితో చెప్పాడో, అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. ‘బింబిసార’ విషయంలో ఇప్పుడు మాకు భయం లేదు, ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుతగా ఉందని తారక్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.