బాసర ట్రిపుల్‌ ఐటీలో గవర్నర్‌ తమిళిసై

గత కొంతకాలంగా బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆదివారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అక్కడికి వెళ్లారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత వారితో మాట్లాడి ట్రిపుల్‌ ఐటీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గర్వర్నర్.. బాసర ఆర్జీయూకేటీలో చాలా సమస్యలున్నాయన్నారు. విద్యార్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని.. సమస్యలన్నీ పరిష్కరించదగినవేనన్నారు. వసతిగృహంలో మెస్‌ నిర్వహణ సరిగా లేదన్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు లేరని.. 2017 నుంచి వారికి ల్యాప్‌టాప్‌లు అందివ్వడం లేదన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.