ఎంపీ సుమ‌న్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌…!! కేసులో వివ‌రాలు వెల్ల‌డించిన పోలీసులు..!!

రోజుకో ప్ర‌జాప్ర‌తినిధి వివాదం అధికార టీఆర్ఎస్ పార్టీకి త‌ల‌నొప్పిగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఫోన్ కాల్ బెదిరింపులు, భూ సెటిల్ మెంట్స్ విష‌యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ‌కెక్కుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ వంతు వ‌చ్చింది. ఎంపీ బాల్క సుమ‌న్ లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇద్ద‌రు మ‌హిళ‌లు ఆరోపిస్తున్నారు. ఎంపీపై లైంగిక వేధింపుల కేసును సీరియ‌స్ గా తీసుకున్న మంచిర్యాల పోలీసులు నిజానిజాల‌ను నిర్ధారించారు. వాస్త‌వాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.

సంధ్య,విజేత అనే అక్కచెల్లెళ్ళ ఆరోపణలు అవాస్తవమ‌ని సిఐ మహేష్ చెప్పారు. మార్ఫింగ్ ఫోటోలతో ఎంపీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఈ విషయం లో వారిపై ఆరు నెలల క్రితమే కేసు నమోదు చేశామ‌ని, దురుద్ధేశాలతోనే ఆరోపణలు చేస్తున్నారు సీఐ తెలిపారు. గతంలోనూ ఈ అమ్మాయిలు పలువురిని ఇలాగే చేశారని చెప్పారు.

సంద్య , విజేతల పై 2018 పిబ్రవరి 6 న కేసు నమోదు చేశామ‌ని, ఎంపీ ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి లబ్ది పొందాలనే ఉద్దేశంతో ఎంపీ కుటుంబ సభ్యుల పోటోను మార్పింగ్ చేసి ఆన్ లైన్ లో సర్క్యూలేట్ చేశార‌ని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారహిల్స్ లోను కేసులు నమోదయ్యాయని, వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు పోలీసులు. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై 420 , 292 A , 419 , 506 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు తెలిపారు మంచిర్యాల సీఐ మ‌హేష్.