లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదు : కవిత

ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక తనపై విమర్శలు చేస్తున్నారని, ఏ దర్యాప్తుకైనా తాము సహకరిస్తామని ఆమె ప్రకటించారు. బట్టకాల్చి మీదేసి తుడుచుకోమనేలా బీజేపీ నేతల వ్యవహార శైలి ఉందని, అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మానసికంగా కుంగదీసే ప్రయత్నాలలో భాగంగానే బీజేపీ నేతలు కట్టుకథలు అల్లుతున్నారని కవిత ఆరోపించారు.

దేశంలో అన్ని దర్యాప్తు సంస్థలు వారి చేతుల్లో ఉన్నాయని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని చెప్పారు. బీజేపీ విధానాలను విమర్శిస్తున్నందుకే తమ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, బీజేపీ నిరాధార ఆరోపణలకు తాము బెదిరిపోమని కవిత చెప్పారు. తాము కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు.