రిలయన్స్‌ నుంచి సాఫ్ట్‌ డ్రింక్స్‌.. త్వరలో లాంచ్

రిలయన్స్‌ నుంచి సాఫ్ట్‌ డ్రింక్స్‌ రాబోతున్నాయి. ఢిల్లీకి చెందిన ప్యూర్‌ డ్రింక్‌ గ్రూప్‌ నుంచి కాంపా, సోస్యో సాఫ్ట్‌ డ్రింక్స్‌ బ్రాండ్స్‌ను రిలయన్స్ కొనుగోలు చేసింది. వీటిని రిలయన్స్‌ మళ్లీ రీలాంచ్‌ చేయనుంది. మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెప్సీ, కోకా-కోలాకు పోటీగా కాంపా కోలాను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళికి కాంపా బ్రాండ్‌ను రీలాంచ్‌ చేయాలని రిలయన్స్‌ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లు, జియో మార్ట్‌, కిరాణా స్టోర్లలో వీటిని విక్రయానికి ఉంచనున్నట్లు తెలుస్తోంది. 1990ల్లో పార్లే తీసుకొచ్చిన థమ్స్‌ అప్‌, గోల్డ్‌ స్పాట్‌, లిమ్కాతో సమానంగా కాంపా డ్రింక్‌ మార్కెట్లో ఓ వెలుగు వెలిగింది. ఎప్పుడైతే కోకాకోలా… పార్లే ఆగ్రో బ్రాండ్లను కొనుగోలు చేసిందో కాంపా అంతర్థానం మొదలైంది. ఆ తర్వాత పలుమార్లు మార్కెట్లోకి రీ ఎంట్రీకి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ పాపులర్‌ బ్రాండ్‌ను రిలయన్స్‌ కొనుగోలు చేయడం ద్వారా ఈ బ్రాండ్‌ రీ ఎంట్రీ ఇవ్వనుంది.