డిప్రెషన్‌లో కేసీఆర్.. బండి షాకింగ్ ఆరోపణలు

మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన కొడుకు, కుమార్తెపై  వస్తోన్న అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భయపడుతున్నారని ఆరోపించారు. దీంతో సీఎం బాగా డిప్రెషన్‌లోకి వెళ్లారన్నారు.

ఎన్నికలు వస్తేనే మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయి.. మా పేరు చెప్పి మీటర్లు పెడితే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోడానికి ప్రజలు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని నలుగురు మహిళలు చనిపోయారు. దేశంలో ఎక్కడా జరగని సంఘటన ఇది. ఇప్పటికీ ప్రభుత్వం వాళ్లని ఆదుకోలేదు. గంట లోపల 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయడం ఏంటి ? అని ప్రశ్నించారు. ఈ దుర్ఘటనకు ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యత వహించాలి. వెంటనే ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.