మునుగోడులో రాజకీయ కుట్ర

మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకుండా బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.  రెండు పార్టీల మధ్య చర్చ ఉండేలా ప్రజలను రెచ్చగొడుతున్నాయి అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడుతో పాటు నల్గొండ ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. అది కూడా పాల్వాయి స్రవంతి తండ్రి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలోనే జరిగింది.

టీఆర్ ఎస్, బీజేపీ వ్యూహాత్మక రాజకీయ కలయికతో కాంగ్రెస్‌ మొదటి స్థానంలో గెలవొద్దని, రెండో స్థానం కూడా రావొద్దని కావాలనే ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మునుగోడు ఓటర్లు గమనించాలి. సమస్యల పరిష్కారం విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న కమిట్‌మెంట్‌ తెరాస, భాజపాకు ఉండదు. మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే.. రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలకు మేలు చేసినవారవుతారు. ఒక ఎకరం ఉన్న రైతుకు వచ్చే రైతు బంధుతో ఆ కుటుంబం ఏడాది మొత్తం బతకలేదు. రైతులకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం, ఆర్థిక సహకారం అందిస్తేనే రైతుకుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇలాంటి పని కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యం. సోనియా, రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే కుటుబం కాంగ్రెస్‌ది. ఇది మునుగోడు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకోవాలి” అని అన్నారు.