టీ20 వరల్డ్ కప్ : జింబాబ్వేపై విండీస్ గెలుపు

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయం సాధించింది. జింబాబ్వేపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ జాన్సన్‌ ఛార్లెస్‌ (45) రాణించగా.. రోమన్‌ పావెల్‌ (28), అకీల్‌ హొసేన్‌ (23*) పర్వాలేదనిపించారు. జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా 3 వికెట్లు తీయగా, ముజారబానీ 2 వికెట్లు పడగొట్టాడు.

154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 122 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఓపెనర్లు విస్లే (27), చకబ్వా (13) వెనుదిరగడంతో ఆపై వచ్చినవారు వచ్చినట్లుగా పెవిలియన్‌ చేరారు. చివర్లో ల్యూక్‌ జోగ్వే (29), ర్యాన్‌ బర్ల్‌ (17) విండీస్‌ విజయాన్ని కొద్దిసేపు అడ్డుకున్నారు. అల్జారీ జోసెఫ్‌ 4 వికెట్లు, జాసన్‌ హోల్డర్‌ 3 వికెట్లు తీసి విండీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.