మరికొద్దిసేపట్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.

మొయినాబాద్‌ సమీపంలోని ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. వారిని పోలీసు అధికారులు రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారిస్తున్నారు. బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు సమాచారం. మరోవైపు మరికాసేపట్లో నలుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రానున్నారు. ఈ వ్యవహారం గురించి పూర్తి వివరాలు చెప్పనున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ రోజు సీఎం కేసీఆర్ సైతం మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.