సూర్యాపేట ఘోర రోడ్డు ప్రమాదం.. ఇదుగురు మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు. వారిలో దాదాపు 38 మంది ట్రాక్టర్‌ ట్రాలీలో ఇళ్లకు తిరుగుప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాద స్థలి నుంచి క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌లు సరిపోలేదు. దీంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో తీసుకెళ్లారు. తన్నీరు ప్రమీల (35), చింతకాయల ప్రమీల (33), ఉదయ్‌లోకేశ్‌ (8), నారగాని కోటయ్య (55) మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. గండు జ్యోతి (38) చికిత్స పొందుతూ మరణించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.