సీఎం ఇంటి దగ్గర బాంబు కలకలం

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఇంటి వద్ద బాంబు కలకలం రేపింది. చండీగఢ్‌లోని సీఎం ఇంటికి సమీపంలో అనుమానాస్పద పేలుడు పదార్థాన్ని గుర్తించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో తక్షణమే బాంబు నిర్వీర్య స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.

సోమవారం సాయంత్రం 4 నుంచి 4.30గంటల సమయంలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఇంటికి దాదాపు కి.మీ దూరంలోని ఓ మామిడి తోటలో ట్యూబ్‌వెల్‌ ఆపరేటర్‌ ఈ బాంబును గుర్తించారు. ఇక్కడ అవాంఛనీయ పదార్థం ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అక్కడికి చేరుకొని పరిశీలించగా.. బాంబుగా గుర్తించాం. దాన్ని సీజ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నాం. అసలు అది ఇక్కడకు ఎలా వచ్చింది తదతర వివరాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. మరోవైపు, బాంబు స్క్వాడ్‌తో ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడికి ఆర్మీ సిబ్బంది చేరుకొని పర్యవేక్షిస్తున్నారు’ అని చండీగఢ్‌ అడ్మినిస్ట్రేషన్ నోడల్‌ ఆఫీసర్‌ కుల్దీప్‌ కోహ్లీ మీడియాకు తెలిపారు.