లవ్‌స్టోరి.. కంటిన్యూ !

సాయి పల్లవి, నాగ చైతన్య గతంలోనే ఓ సారి లవ్ లో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరి’ సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ప్రేమకథ యావరేజ్ అనిపించుకుంది. అయితే వీరిద్దరి లవ్‌స్టోరి కంటిన్యూ కాబోతుంది. మరోసారి ఈ జంట తెరపై కనువిందు చేయనుందనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇప్పుడీ.. ఈ ప్రచారమే నిజమైంది.

చందూమెండేటి దర్శకత్వంలో సాయి పల్లవి- నాగ చైతన్య జంటగా ఓ సినిమా తెరకెక్కనుంది. నాగ చైతన్య 23వ చిత్రం (NC23) వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రమిది. 2018 నవంబరులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రంలో వీరవల్‌ వద్ద సముద్రంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున సరిహద్దు దేశం పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. వీరు పాకిస్థాన్‌లో ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించారు.

ఈ క్రమంలో పెళ్లైన కొద్ది రోజులకే కోస్టుగార్డులకు చిక్కడం, భార్యకు కాన్పు జరిగినా ఏ బిడ్డ పుట్టిందో కూడా తెలియని స్థితి, బాలింతగా భార్య అవస్థలు వంటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని దానికి ఓ ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.