కామెడీ ‘యాక్షన్’ రిస్కేమో.. ?

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ హీరోగా మారడం కొత్తేమీ కాదు. బ్రహ్మానందం, అలీ.. లాంటి వాళ్లు హీరోయిజం చూపించినవాళ్లే. హీరోయిజం చూపించినంత మాత్రాన హీరోలుగా సెట్టైపోలేదు. మళ్లీ వచ్చి కామెడీ చేశారు. ప్రేక్షకులని నవ్వించి.. మెప్పించారు. పూర్తిస్థాయి హీరోగా మారాలనుకొన్న సునీల్ కోరిక నెరవలేదు. ఆయన మళ్లీ కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడా ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఐతే, ఇటీవల హీరోలుగా మారిన కమెడియన్స్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఆశ్చార్యానికి గురి చేస్తున్నాయి.

జబర్థస్త్ కమెడియన్ శకలక శంకర్ ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఐతే, ఈ సినిమాలో కామెడీ కంటే యాక్షన్ మీదే ఫోకస్ చేశాడు. అది సినిమా ఫలితాన్ని దెబ్బ తీసినట్టు స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే ‘స‌ప్తగిరి ఎక్స్ ప్రెస్‌’, ‘స‌ప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ చిత్రాల్లో హీరోగా నటించిన కమెడియన్ సప్తగిరి కూడా యాక్షన్ లోకి దిగాలని చూడటం షాక్ కి గురి చేస్తోంది. కొత్త దర్శకుడు డి.రామ‌కృష్ణ దర్శకత్వంలో స‌ప్తగిరి హీరోగా ‘గజదొంగ’ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసుకురానున్నారని తెలిసింది. సినిమా కథ విలేజ్ మరియు టౌన్ నేపథ్యంలో సాగుతుందట. దీంతో కమెడియన్ యాక్షన్ లోకి దిగడం రిస్కే అనే కామెంట్స్ వినబడుతున్నాయి. కమెడియన్ యాక్షన్ లోకి దిగితే.. అది కాస్త కామెడీ యాక్షన్ అవుతుందేమో.. ! అన్నట్టు ‘గజదొంగ’ని ఆగస్టు రెండో వారం నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.