వేగ్నేశ.. దిల్‌రాజు కాంపౌండ్‌ దాటరా… !?


యంగ్ టాలెంట్ ని గుర్తించడం, ఆ టాలెంట్ ని వాడుకోవడం నిర్మాత దిల్‌రాజుకు బాగా తెలుసు. ఒక్క హిట్టు ప‌డితే… దిల్‌రాజు వాళ్ల‌ని వ‌ద‌ల‌డు. హ‌రీష్ శంక‌ర్‌, వంశీపైప‌డిప‌ల్లి, అనిల్‌రావిపూడిల ప‌రిస్థితి అంతే. ఈ యువ దర్శకులు వరుసగా దిల్ రాజు బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడీ లిస్టులో స‌తీష్ వేగ్నేశ కూడా చేరిపోయాడు.

‘శ‌త‌మానం భ‌వ‌తి’ సినిమాతో స‌తీష్ వేగ్నేశ దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు దిల్ రాజు. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఏకంగా జాతీయ అవార్డుని తెచ్చిపింది. ఆ వెంట‌నే వేగ్నేశ మ‌రో సినిమా దిల్‌రాజు కాంపౌండ్‌లోనే ఫిక్స్ అయ్యింది. అదే ‘శ్రీనివాస కళ్యాణం’. నితిన్-రాశీఖన్నా జంటగా నటించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పై పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. ‘శతమానం భవతి’ని మించిన సినిమా అవుతుందని చెప్పుకొంటున్నారు.

ఇప్పుడు విగ్నేశకు దిల్ రాజు ముచ్చ‌ట‌గా మూడో ఆఫ‌ర్ ఇచ్చేశాడు. అది కూడా ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌రేన‌ట‌. చూస్తుంటే.. దిల్ రాజు కాంపౌండ్‌ నుంచి వెగ్నేశ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనబడటం లేదు.