మాజీ ప్ర‌ధాని వాజ్ పెయి అస్త‌మ‌యం.

భార‌త మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పెయి గురువారం సాయంత్రం 5గంట 05 నిమిషాల‌కు మ‌రణించారు. దేశ ప్ర‌ధానిగా విశిష్ట సేవ‌లందించి త‌న మార్కు రాజ‌కీయాల‌ను చాటిచెప్పిన మ‌హ‌నీయుడు వాజ్ పెయి ఇక లేరు. జూన్ 11న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న గ‌త తొమ్మిది వారాలుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గ‌త కొద్దిరోజులుగా ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. గురువారం ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో దేశ వ్యాప్తంగా ఆయ‌న ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఆయ‌న శ‌రీరం వైద్యానికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో వైద్యులు కూడా ఏమీ చేయ‌లేక‌పోయారు. చివ‌ర‌కు సాయంత్రం 5గంట‌ల 5 నిమిషాల‌కు ఆయ‌న తుది శ్వాస విడిచిన‌ట్టు ఎయిమ్స్ ఆసుప‌త్రి ప్ర‌క‌టించింది.