షాకింగ్ : చ‌నిపోయిన వ్య‌క్తి ఫోన్ కోసం లోన్ తీసుకున్నాడ‌ట‌!!

అదేంటీ చ‌నిపోయిన వ్య‌క్తి ఫోన్ కొన‌డం ఏంటి, లోన్ తీసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా. అస‌లు చ‌నిపోయిన వ్య‌క్తి ఎలా లోన్ తీసుకున్నాడో తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది ఈ సంఘ‌ట‌న‌. అహ్మదాబాద్ నగరంలోని లాల్ దర్వాజా ప్రాంతంలోని వసంత్ చౌక్ నివాసి భవస్కర్ జనవరి 26వతేదీన టాటా కేపిటల్ నుంచి ఎన‌భైవేల లోన్ తీసుకున్నార‌ట‌. హిమాలయన్ మాల్ లోని క్రోమా ఎలక్ట్రానిక్స్ షోరూం నుంచి ఐఫోన్ కొన్నాడు.

భవస్కర్ ఈ లోన్ ను ఆరునెలల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉండగా ఒక్క నెల వాయిదా కూడా చెల్లించక పోవడంతో టాటా కేపిటల్ ప్రతినిధి అడిగిందేందుకు రుణం తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లాడు. భవస్కర్ జనవరి 23వతేదీన మరణించాడని అతని కుటుంబసభ్యులు చెప్పడంతో కంపెనీ ప్ర‌తినిధి షాక్ కు గుర‌య్యాడు. దీనిపై దర్యాప్తు చేయ‌గా. కంపెనీ కస్టమర్ రిలేషన్ ఉద్యోగులు చైతన్యపటేల్, ధ్రుకేష్ పటేల్ లు నకిలీ డాక్యుమెంట్లతో చ‌నిపోయిన‌ వ్యక్తి పేరిట లోన్ తీసుకున్నారని తేలింది. దీంతో కంపెనీ ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.