బీజేపీ టార్గెట్’లో గంభీర్ కూడా !


క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ రాజకీయాల్లోకి రాబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నారు బీజేపీ వర్గాలు. నోట్ల రద్దు, జీఎస్టీ, అక్రమ కట్టడాల తొలగింపునకు అనుమతులు ఇవ్వడంతో స్థానిక భాజపా నాయకులపై ఢిల్లీ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఈ ప్రభావం ప్రధాని నరేంద్ర మోదీపై ఏమాత్రం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే భాజపా వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని వ్యూహాలు రచిస్తోందని బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు.

ఇందులో భాగంగా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ను బరిలోకి దించాలని చూస్తోంది. పశ్చిమ దిల్లీ నుంచి గంభీర్‌ను పోటీలోకి దింపాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి చెబుతున్నారు. ఇక, గంభీర్‌ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్టే. ఆయన భారత్‌ తరఫున 2013లో చివరి వన్డే ఆడాడు. గత ఏడాది రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్‌ చివరి సారిగా కనిపించాడు.