తారక్ తల్లిని ఏడిపిస్తున్నాడు

అమ్మ ఎవరికైనా అమ్మే. ఇప్పుడా అమ్మని ఏడిపిస్తోంది తారక్ పాట. ఆయన తాజా చిత్రం ‘అరవింద సమేత’. బుధవారం ఈ చిత్రంలోని రెండో పాటైన ‘పెనివిటి’ లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట గుండెల్ని పిండేస్తోంది. ఈ పాట విని సంగీత దర్శకుడు థమన్ తల్లి ఏడ్చేసిందట. ఈ విషయాన్ని తమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

‘ఈమె మా అమ్మ. ‘పెనివిటి’ పాట విన్నాక అమ్మ నన్ను తన గదిలోకి పిలిచింది. నేను వెళ్లగానే నన్ను పట్టుకుని ఏడ్చేసింది. నా చొక్కా ఆమె కన్నీటితో తడిసిపోయింది. ఈ పాట వినగానే ఓ తల్లి కంట్లో నుంచి వచ్చిన నిజమైన భావం అది. ప్రపంచంలో అమ్మకు మించింది ఏదీ లేదు’ అని ట్వీట్‌ చేస్తూ తల్లితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు తమన్‌.

పెనివిటి’ పాటకు ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సినిమాలో ఎన్టీఆర్‌ తల్లి ఏడుస్తూ పాడుతున్న పాటగా ఆ గీతాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే, ఈషా రెబ్బా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.