మళ్లీ సర్జికల్‌ స్ట్రయిక్స్‌

భారత సైనిక దళాలు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తరహాలో మరో ఆపరేషన్‌ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం ముజఫర్‌నగర్‌లో రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ‘‘ఏదో జరిగింది. ఇప్పుడు దాన్ని బయటపెట్టలేను. నన్ను నమ్మండి. రెండు-మూడు రోజుల క్రితం భారీ పరిణామం చోటుచేసుకుంది’’ అన్నారు. దీంతో భారత్ సైన్యం మరోసారి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేపట్టినట్టు భావిస్తున్నారు. అది ఎప్పుడు జరిగింది ? ఎలా ప్లాన్ చేశారు.. ?? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల సరిహద్దు భద్రతాదళం జవాను నరేంద్ర సింగ్‌ పాకిస్థాన్‌ దళాల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో పాటు పాక్‌కు చెందిన ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని ముగ్గురు పోలీసులను కిడ్నాప్‌ చేసి దారుణంగా చంపేశారు. ఇందుకు భారత సైనిక దళాలు ప్రతీకారం తీర్చుకొన్నట్టు రాజ్ నాథ్ సింగ్ మాటలని బట్టీ అర్థమవుతోంది. ఐతే, అవి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నే అన్నది తెలియాల్సి ఉంది. జవాను నరేంద్ర సింగ్‌ దారుణ హత్య నేపథ్యంలో ఇటీవల ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్, పాక్‌తో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.