త్రివిక్ర‌మ్ ఈసారి స్పీచ్ లెస్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బయట చాలా తక్కువ సార్లు, చాలా తక్కువ మాట్లాడతారు. మాట్లాడిన ఆ నాలుగు మాటలు కూడా బుల్లెట్స్ లా పేలుతాయ్. వాటి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయన చేసిన సినిమా ఆడియో ఫంక్షన్స్ లేదంటే ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ లో అవి లభిస్తాయని. ఐతే, ‘అరవింద సమేత’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్ స్పీచ్ లెస్ గా కనిపించారు.

‘కొన్నిసార్లు మాట్లాడ‌డం కంటే మాట్లాడ‌క‌పోవ‌డ‌మే ఉత్తమం. ఇది నాకు అలాంటి ప‌రిస్థితి అంటూ… న‌టీన‌టుల‌కూ, సాంకేతిక నిపుణుల‌కూ అభినంద‌లు కృత‌జ్ఞ‌త‌లు చెప్పేసి ముంగించేశాడు’ త్రివిక్రమ్. దీంతో త్రివిక్ర‌మ్ మెరుపు లేకుండా అరవింద సమేత ప్రీ-రిలీజ్ వేడుక జరిగిపోయింది. అది తారక్ అభిమానులని నిరాశపరిచినట్టయ్యింది.

త్రివిక్రమ్ మౌనం రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తారక్ తండ్రి పోయిన బాధలో ఉన్నాడు. ఆ బాధలోనే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా. ఇలాంటి నేపథ్యంలో సినిమా వేడుక జరపడమే కష్టం. ఒకవేళ నిర్మాత, సినిమా ప్రమోషన్స్ కోసం చేసినా.. మాటలు రాని పరిస్థితి. త్రివిక్రమ్ విషయంలో అదే జరిగింది. ఇక, రెండోది అజ్ఝాతవాసి తర్వాత తనపై వచ్చిన విమర్శలని సినిమా ఫలితంతోనే బదులివ్వాలని.. మాటలతో కాదన్నది త్రివిక్రమ్ భావన.